Friday, February 12, 2016

50 ఏళ్ళ పరిచయాలు .

పిళ్లా సుబ్బారావు గారు 1962 నుంచి నాకు పరిచయం  .  ఆయన అప్పటికే 'ఆంధ్ర ప్రభ' దినపత్రికలో  "చిత్ర జగత్" శీర్షికతో పాకెట్ కార్టూన్లు వేస్తూ ఉండేవారు .  అప్పట్లో ఆ కార్టూన్లు గొప్ప సంచలనం .  దానికి ముందే , 'పారిపోయిన బఠానీ ' పిల్లల నవల వ్రాసి  రచయితగా కూడా గుర్తింపు పొందేరు .  వారు సినిమా పబ్లిసిటి రంగంలో కుడా వున్నారు .   'గీతా సుబ్బారావు' గా అందులోనే స్థిరపడి పోయారు .  నేను 1962 లో , సినిమా ప్రకటనలు , పోస్టర్ డిజైన్ లు కొన్ని సినిమాలకు వేసాను .  అప్పుడే ఆయనతో పరిచయం .

      1962 లో "బాపు ఆర్టు ఎక్సిబిషన్ " విజయవాడ లో జరిగింది .  దాని నిర్వహణ కార్యక్రమాలు సుబ్బారావు గారే  చూసారు --శ్రీ కాట్రగడ్డ నర్సయ్య అండదండలతో .  అందులో నేను కూడా పాలుపంచుకున్నాను ( వయసు 16 ఏళ్ళు ). మరునాటికి  ప్రదర్శనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న ఆ రాత్రి బాపు గారు  విచ్చేసి మమ్మల్ని అందరిని
అభినందించారు .కరచాలన చేసారు .   బాపు గారు వేసిన వేలాది బొమ్మలు  ప్రదర్శన  కోసం నా చేతులతో అలంకరిస్తుంటే , నేను కూడా బొమ్మలు , కార్టూన్ లు  వేయాలనిపించింది .  నాకు గురువు లాంటి మిత్రుడు , కీ. శే . క్యానం భగవాన్ దాస్ కూడా , సినిమా పబ్లిసిటీ మానేసి  కార్టూన్ లు, బొమ్మలు సాధన చెయ్యమని ప్రోత్సహించాడు . ఆ విధంగా బాపు గారి బొమ్మలు , నా జీవిత గమనాన్ని మార్చివేసింది .

     సుబ్బారావు గారు, చలన చిత్ర ప్రచార రంగం లో వుండిపోయారు .  నేను హైదరాబాద్ లో వున్నప్పుడు , అప్పుడప్పుడు కలుస్తూ వుండేవాళ్ళం .  చాలా ఏళ్ళ తర్వాత,  పోయిన సంవత్సరం విజయవాడలో 3 వ 'ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ' జరిగినప్పుడు  అక్కడ కనిపించారు .  ఫోటో దిగాము .
   
     సుబ్బారావు గారు! మీకు శుభాకాంక్షలు

No comments: